top of page
  • వేదములు - ఉపనిషత్తులు - పురాణములు

1. వేదములు - ఉపనిషత్తులు - పురాణములు

 

శ్లో||  ఓం వ్యాసాయ విష్ణురూపాయ | వ్యాసరూపాయ విష్ణవే |

       నమో వై బ్రహ్మనిధయే - వాసిష్ఠాయ నమో నమః ||

 

వేదము : తెలుసుకొనవలసినది, తెలివి రూపము, సర్వము తెలియజేయు శాస్త్రము, జ్ఞానము అని అర్థము. పురుషార్థములన్నింటి గురించి ప్రమాణముగా విధినిషేధముగా తెలియజేయునది.

 

వేదాంతము : తెలియబడుదానికంటే వేరై, దానికి ఆవలగల కేవలమైన తెలుసుకొనువాడు, అట్టి కేవలద్రష్టను నిర్ణయముగా తెలుపునది. తెలుసుకొనుటను అంతము చేసి, అతీతమైన పరమును నిర్ణయము చేయునది.

 

వేదములు : 
1. ఋగ్వేదము : దీనిలో 12 భాగములు కలవు. పైల ఋషిచేత కూర్చబడినది.

2. యజుర్వేదము : కృష్ణ యజుర్వేదములో 94 భాగములు, శుక్ల యజుర్వేదములో 15 భాగములు కలవు. మొత్తము 109 భాగములు కలవు. వైశంపాయన ఋషిచేత కూర్చబడినది.

3. సామవేదము : 1000 భాగములు కలవు. జైమినీ ఋషిచేత కూర్చబడినది.

4. అధర్వణ వేదము : 50 భాగములు కలవు. సుమంత ఋషిచేత కూర్చబడినది.

 

వేదవ్యాసుడు : వేదములకు సంబంధించిన విజ్ఞానమును వివరణగా విస్తరింపజేయువాడు అని అర్థము. ఋషుల తపో నిష్ఠలో దర్శించబడిన వేదములు గురు శిష్య పరంపరగా బోధించబడుచున్నవి. కాలాంతరమున కొన్ని భాగములు సరియైన అర్థము మారిపోవుట గాని, అంతరించుట గాని జరుగవచ్చునని, తత్‌ నివారణకు ఆ వేదములను నాలుగుగా విభజించి నలుగురు శిష్యులచేత క్రోడీకరించబడిన దానిని గ్రంథస్థము చేసి, తరువాతి తరములకు అందించినవాడు.

 

వేదములలోని విభాగములు :
 

1. కర్మకాండ : సంహిత రూపములో నుండును. సంహిత అనగా మంత్ర భాగము.
2. ఉపాసన కాండ : బ్రాహ్మణ్య రూపములోను ఆరణ్యక రూపములోను ఉండును. గృహస్థులకు చెప్పబడిన యజ్ఞ క్రతువులు, నియమములు, విధానము, కావలసిన వస్తువులు, అర్థతాత్పర్యములు, ఫలితములు కలిపి బ్రాహ్మణ్యములనబడును. వానప్రస్థులకు చెప్పబడిన యజ్ఞ క్రతువులు, నియమములు, విధానము, కావలసిన వస్తువులు, అర్థ తాత్పర్యములు, ఫలితములు కలిపి ఆరణ్యకములనబడును.

3. జ్ఞానకాండ : ఉపనిషత్తుల రూపములో నుండును. ఉపనిషత్తు అనగా సమీప స్థానము. సమీప ఆసనము. అనగా ఆత్మ సమీపమునకు గొనిపోవుటను తెలిపేది, జ్ఞాన నికేతనము. పరబ్రహ్మ లక్ష్యమునకు అత్యంత సమీపమునకు గొనిపోవునది. ఏ సమీపమునకు చేరిన సద్గతి కలుగునో,  అట్టిది ఉపనిషత్తు.

 

ఉపవేదములు : 1. ఋగ్వేదమునకు ఆయుర్వేదము. దీనికి బ్రహ్మ, ప్రజాపతి, అశ్వనీ కుమారులు, ధన్వంతరీ మొదలగువారు కర్తలు. 2. యజుర్వేదమునకు ధనుర్వేదము. దీనికి విశ్వామిత్రుడు కర్త. అస్త్ర శస్త్రములను యుద్ధమందు వినియోగించు శాస్త్రము. 3. సామవేదమునకు గాంధర్వ వేదము. దీనికి భరతముని కర్త. స్వరము, తాళము, నృత్యము, వాద్యము మొదలగునవి బోధించు శాస్త్రము. 4. అధర్వణ వేదమునకు  అర్థవేదము.  దీనిలో నీతి శాస్త్రము, అశ్వ శాస్త్రము, శిల్ప శాస్త్రము, ఆర్థిక శాస్త్రము, పాక శాస్త్రము మొదలగునవి కలవు.

 

షడంగములు :

 

1. శిక్ష : దీనికి కర్త పాణిని ఋషి.

2. కల్ప సూత్రము : యజ్ఞము చేయు బ్రాహ్మణుని ఋత్విజుడని అందురు. అతని వలన చేయబడవలసిన అనేక కర్మల పద్ధతులకు కల్పసూత్రములని పేరు. దీనికి కర్త కాత్యాయన, అశ్వలాయన మునులు.

3. వ్యాకరణము : వేద శబ్దములయొక్క శుద్ధ జ్ఞానమును అందించుటకు అవసరమైనది వ్యాకరణము. కాత్యాయనముని, పాతంజలి ఋషి, వార్తిక, భాష్యములనెడి వ్యాఖ్యానములను పూర్వోక్త సూత్రములను చేసియుండిరి. ఇట్టి వ్యాఖ్యానము వ్యాకరణ సూత్రములచే స్పష్టమగును.

4. నిరుక్తము : యాస్కులనెడి ముని నిరుక్తమును చేసియుండిరి. వేద మంత్రములలో ప్రసిద్ధముగా లేని పదములకు ఇందులో అర్థములను బోధించిరి. వేదములలో చెప్పబడనివని నిరుక్తమునకు అర్థము. కాని ఈ చెప్పబడని పదములకు ఇప్పుడు నిర్వచించుచున్నందున నిరుక్తమనగా, నిర్వచింపబడ గల పదములు అని అర్థము. అనిరుక్తమనగా దేశకాల కారణములకు అతీతమై, అనిర్వచనీయమైన వస్తువు. అదియే అవ్యక్తము. అవ్యాకృతము, పరబ్రహ్మ.

5. జ్యోతిషము : కాల జ్ఞానము జ్యోతిషము వలన కలుగుచున్నది. దీనికి ఆదిత్యుడు, గార్గి మొదలగువారు కర్తలు.

6. పింగలము లేక ఛందస్సు : గాయత్రి, అనుష్ఠుప్‌ మొదలగు ఛందస్సులు పింగలముని వలన నిరూపించబడినవి. ఛందోబద్ధముగా పఠించబడిన వేదములు జ్ఞాపకముండును. ఛందస్సు లేని వాక్యములు మరపులోనికి పోవును.

 

 

వైఖరీ వేదము : దీనిలో ఛందస్సులుండును. గాయత్రీ, ఉష్ణిక్‌, అనుష్ఠుప్‌, బృహతి, పంక్తి, త్రిష్ఠుప్‌, జగతి,అతిఛందము, అత్యష్టి, అతిజగతి, అతి విరాట్‌ మొదలగునవి అన్నీ వైఖరీ వేదములోనివి.

 

వేదముల ఉపాంగములు

1. న్యాయ వైశేషికము 2. మీమాంస 3. స్మృతులు 4. పురాణములు.

 

1. న్యాయవైశేషిక సూత్రములు : గౌతమ మునిచే చేయబడినవి. కణాదులముని కూడా ఈ సూత్రములను చేసిరి. యుక్తి, చింతన, మననము వలన వేదాంత జ్ఞానమే ఫలమగును.

2. మీమాంస ద్వివిధము :  (1) ధర్మ మీమాంస (2) బ్రహ్మ మీమాంస. ధర్మమీమాంసను పూర్వ మీమాంస అనియు, బ్రహ్మ మీమాంసను ఉత్తర మీమాంస అనియు అందురు. ధర్మ మీమాంసకు జైమినీముని కర్త. బ్రహ్మ మీమాంసకు వేద్యాసులవారు కర్త. పూజితమైన విచారణను మీమాంస అందురు. పూజితమనగా పరమ పురుషార్థమైన మోక్షమునకు కారణమైన అర్థమును నిర్ణయించును. ధర్మ మీమాంస యందు యజ్ఞాది కర్మానుష్ఠాన పద్ధతుల వివరణ కలదు. బ్రహ్మ మీమాంస యందు శ్రవణాదులకు సంబంధించిన తత్త్వ విచారణ కలదు. ఉత్తర మీమాంస అయిన బ్రహ్మ మీమాంసకు పూర్వమీమాంస అయిన ధర్మమీమాంసను పూర్తిచేసిన అనుష్ఠానపరులు అధికారులు. బ్రహ్మ మీమాంసయందు విడివిడిగా గాని, కలగలుపుగా గాని శారీరక, బ్రహ్మ సంబంధమైన శ్రుతులు సూత్రీకరించ బడినవి. అందువలన దీనికి శారీరక మీమాంస అనియు, బ్రహ్మ మీమాంస అనియు అందురు. మరియు వేదాంత మీమాంస అని, బ్రహ్మ సూత్రములని పేరులు. కర్తయైన వేదవ్యాసుని బాదరాయణుడని అందురు.

              శరీరి అయిన జీవునికి, బ్రహ్మ తత్త్వమునకు గల సంబంధమును విచారణ చేయుటను శారీరక మీమాంస అందురు.

         జగత్తునకు, ప్రాణులకు కారణమైన బ్రహ్మ మరియు అసంగుడైన బ్రహ్మ - ఈ రెండింటినీ తటస్థ, స్వరూప లక్షణములుగా నిర్ణయము చేయుట బ్రహ్మ విచారణ గనుక, దీనిని బ్రహ్మ మీమాంస అందురు.

         దీనిలో ఉపనిషద్వాక్య విచారణ చేయబడును గనుక వేదాంత మీమాంస అందురు.

సూత్రము : 
తక్కువ అక్షరములతో సంశయము రానీయక, సారవంతమైన పెక్కు అర్థములు కలిగి, వ్యతిరేకార్థములను రానీయక, దోష రహితముగా కూర్చబడిన వాక్యములను సూత్రములందురు.

         బ్రహ్మ సూచిత సూత్రములు గనుక బ్రహ్మ సూత్రములందరు. సూత్రరూప బ్రహ్మ విద్యను విరాట్‌ పురుష విద్య అందురు.

3. స్మృతులు :  శ్రుతులలోని వాక్యములను నిరూపించు చారిత్రక దృష్టాంతములు సోదాహరణముగా ఋషులచేత వివరింపబడినవి స్మృతులనబడును. వేదాంగములు, నీతి శాస్త్రము, అర్థశాస్త్రము మొదలగునవి స్మృతుల క్రిందికి వచ్చును. ఉపనిషదర్థములను వివరించు శ్రీమద్భగవద్గీత కూడా స్మృతియే. స్మృతులలో కాయక, వాచక, మానసిక, ధర్మములు, వర్ణాశ్రమ ధర్మములు మొదలగు ధర్మములు కలవు.

 

స్మృతి వ్యాఖ్యాతలు
1. మను స్మృతి. 2. పరాశర స్మృతి. 3. యాజ్ఞవల్క్య స్మృతి. 4. గౌతమ స్మృతి. 5. హరిత స్మృతి. 6. యమస్మృతి, 7. విష్ణు స్మృతి. 8.శంఖ స్మృతి, 9. లిఖిత స్మృతి. 10. బృహస్పతి స్మృతి.11. దక్ష స్మృతి. 12. అంగీరస స్మృతి. 13. సంవర్త స్మృతి. 14. ఆపస్తంభ స్మృతి. 15. ఉశనస్‌ స్మృతి. 16. అత్రి స్మృతి. 17. శాతాపస్మృతి. 18. ప్రచేత స్మృతి.

 

స్మృతి ధర్మానుష్ఠానము 
1. కృత యుగములో మనుస్మృతి. 2. త్రేతా యుగములో గౌతమ స్మృతి. 3. ద్వాపర యుగములో శంఖ స్మృతి, లిఖిత స్మృతి. 4. కలియుగములో పరాశరోక్త స్మృతి ధర్మములను అనుష్ఠానము చేయవలెను.


 

4. పురాణములు : 
అష్టాదశ పురాణములు వ్యాసుల వారిచే రచింపబడినవి. ఉప పురాణములు కూడా పదునెనిమిది ఉన్నవి.

 

శ్రుతి : 
ఋషుల తపస్సులో వినబడి, దర్శించబడి, స్ఫురణకు అందించబడిన సత్యములు. గురు శిష్య పరంపరగా బోధించబడి, శబ్ద ప్రమాణముగా శిష్యులచేత తెలియబడినది. ఒకరి తెలివితో చెప్పబడినవి కావు గనుక అపౌరుషేయము కూడా. చిదాకాశమే అశరీర వాణిగా కొన్ని సంజ్ఞల రూపములో జ్ఞానసంకేతములు వెలువడగా, ఋషులు వాటిని తమ అంతర్‌ హృదయములో విని సంస్కృత భాషలో వాటిని అన్వయించి తెలిపినది.

 

వేదము : 
వ+ఇదం=ఉన్నది ఇది అనే సత్యము. వేదములలోని శబ్దములు శ్రోత్రేంద్రియము ద్వారా బుద్ధిలోనికి ప్రవేశించి, అవి ఏ అర్థమును స్ఫురింప జేసెనో, అట్టి జ్ఞానమును, లేక సత్యమును శ్రుతి అని గాని, వేదము అని గాని అందురు.

 

ఉపనిషత్తులు
1180 ఉపనిషత్తులున్నట్లు తెలిసినది. వాటిలో 108 అందుబాటులో నున్నవి. ఈ 108లో ఆత్మ బ్రహ్మా మోక్షముల గురించి ఉన్నవి కొన్ని మాత్రమే. అందులో దశోపనిషత్తులు ముఖ్యము. శ్రీ శంకరా చార్యులు, ఇతర సద్గురువులు ఈ పదింటికే భాష్యములు రచించిరి. 1. ప్రశ్నోపనిషత్తు 2. ముండకోపనిషత్తు 3. మాండుక్యోపనిషత్తు 4. తైత్తిరీయోపనిషత్తు 5. ఛాందగ్యోపనిషత్తు 6. బృహదారణ్యకోపనిషత్తు 7. ఐతరేయోపనిషత్తు 8. ఈశావాస్యోపనిషత్తు 9. కేనోపనిషత్తు 10. కఠోపనిషత్తు అని దశోపనిషత్తులు.

 

ఇతిహాసము : 
ఇతి+హ+ఆస = ఇలా+ఖచ్చితముగా+ఇది జరిగినది అనగా ఈ చెప్పేది ఇలాగే ఖచ్చితముగా జరిగినది, కల్పితములు గాని, అతిశయోక్తులు గాని లేవు అని అర్థము.

మహా భారతము, రామాయణములు ఇతిహాసములు.

 

భారతమునకు 3 పేర్లు :

 

1. జయము : 8,800 శ్లోకములతో శ్రీవ్యాసమహర్షి వ్రాసినది.

2. భారతము : 24,000 శ్లోకములతో వైశంపాయానుడు పెంచి వ్రాసినది.

3. మహా భారతము : లక్ష శ్లోకములుగా సౌతి పెంచి వ్రాసినది.

              రామాయణము ఇతిహాసము మాత్రమే. భాగవతము పురాణము మాత్రమే. మహాభారతము ఇతిహాసము, పురాణము కూడా. దీనిలో శాస్త్రము, కళ, జీవితము, జీవిత గమ్యము కూడా ఉన్నవి. దీనిలోనే భగవద్గీత మరిన్ని గీతలున్నవి. భగవద్గీత ఉపనిషత్సారము. వేదములవలె సర్వతో ముఖము గనుక, భారతమును పంచమ వేదమందురు.

 

భారతములో పొందుపరచబడిన గీతలు :

 

1.   భీష్మపర్వమందు శ్రీమద్భభగవద్గీత - 1

2.  శాంతి పర్వమందు ఉతథ్యగీత, వామదేవ గీత,

         ఋషభగీత, బ్రహ్మగీత, షడ్జగీత, శంపాక గీత,

         మంకి గీత, బోధ్య గీత, విచఖ్ను గీత, హారీత గీత,

              వృత్రగీత, పరాశరగీత, హంసగీత - 13

3.  అశ్వమేధ పర్వమందు అను గీత, బ్రాహ్మణ గీత - 2

     మొత్తము గీతలు - 16

 

భాగవతము : దీనికే హరివంశమని, ఖిల పురాణమని కూడా పేరులు. ఖిలమనగా అనుబంధము అని అర్థము. ఇది భారతమునకు కొనసాగింపుగా రచించబడినది. అనుబంధముగా రచించబడినందున ఖిల పురాణమని పేరు వచ్చినది. భారతము ధర్మార్థ కామముల గురించి, అందలి పాత్రల ద్వారా తెలియజేయగా, పరమ పురుషార్థమైన మోక్షము గురించి భాగవతము అనుబంధముగా తెలియజేసినది. భారతములో ఎవ్వరును ముక్తులు కాలేదు. పరీక్షిత్‌ మహారాజు ఉత్తర గర్భమందు మరణించి, పునరుజ్జీవించగా, శుక మహర్షి వలన భాగవత శ్రవణము చేసి ముక్తుడయ్యెను. భాగవత పురాణములలో అనేకమంది భక్తులు ముక్తులైనట్లున్నది.

 


మహాభారత ప్రచారము : దేవ లోకములో నారదుని ద్వారా, పితృ లోకములో అసితుడైన దేవలుని ద్వారా, గరుడ గంధర్వ రాక్షస లోకములలో శుకుని ద్వారా, మానవ లోకములో జనమే జయమహారాజుకు చెప్పినట్లు వైశంపా యనుని ద్వారా ప్రచారమయ్యెను. 

 

ఏ వేదములో ఎన్ని ఉపనిషత్తులున్నవి :

 

1. ఋగ్వేదములో                                  10

2. కృష్ణ యజుర్వేదములో                         32

3. శుక్లయజుర్వేదములో                          19

4. సామవేదములో                                 16

5. అధర్వణ వేదములో                            31

 

                మొత్తము ఉపనిషత్తులు          108

 

శ్రేష్ఠమైనవి :

1. వేదములలో అధర్వణ వేదము

2. ఉపనిషత్తులలో నిర్గుణ బ్రహ్మోపనిషత్తు

3. శాస్త్రములలో వేదాంత శాస్త్రము

4. యోగములలో రాజయోగము

5. గుణములలో సత్వ గుణము

6. మంత్రములలో ప్రణవమంత్రము

7. మార్గములలో కుండలీమార్గము

8. మానవులలో వేదాంత ప్రవర్తకుడు.

 

ఋషి : 

ఊర్థ్వ రేతస్కుడు, కామాది దోషములను జయించినవాడు, నిరాహారి, సంయమి, జితేంద్రియుడు, నిగ్రహానుగ్రహ శక్తిగలవాడు, సత్య సంధుడు, మంత్రములను సృజించగలవాడు, ఋక్కులను, వేద వాక్యములను తదర్థభూతమగు పరమాత్మను సాక్షాత్కరించుకొన్నవాడు. ఈ గుణములున్న వానికి ఇచ్చిన పదవి, లేక బిరుదును ఋషిపదముచే పిలిచెదరు.

 

సప్త ఋషులు : 

భృగువు, అత్రి, అంగీరుడు, మరీచి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు అనువారు ఇప్పటి కల్పములోనున్నవారు. వీరు కల్పాంతరములలో మారుచుందురు.

 

వేద విజ్ఞానము ముందుగా ప్రకాశింపజేసుకొన్నవారు :

1. అగ్ని 2. వాయువు 3. ఆదిత్య 4. అంగీరస.

 

ఆచార నిర్ణయము : 

1. కృత యుగములో వేదాచారము

2. త్రేతాయుగములో స్మార్తాచారము

3. ద్వాపర యుగములో పురాణాచారము

4. కలియుగములో ఆగమాచారము

 

ప్రస్థాన త్రయము :

1. శ్రుతి ప్రస్థానము     -       ఉపనిషత్తులు

2. న్యాయ ప్రస్థానము -       బ్రహ్మ సూత్రములు

3. స్మృతి ప్రస్థానము    -       భగవద్గీత

 

ఉత్తమమైనవి :

1. సమస్త వేదసారము - భగవద్గీత

2. సర్వధర్మ నిర్వచన సారము - మనుస్మృతి

3. సర్వ తీర్థమయము - గంగానది

4. సర్వ దేవమయము - విష్ణు భగవానుడు

సాంఖ్య శాస్త్రము : కపిల మహర్షి కర్త

యోగ శాస్త్రము : పతంజలి మహర్షి కర్త

పాంచరాత్రము : నారదముని ఈ తంత్రగ్రంథమునకు కర్త

పాశుపత తంత్రము : పశుపతి దీనికి కర్త

 

నాస్తిక మతము : ఇది నిషేధింపదగినది. 1 మాథ్యమిక 2. యోగాచార 3. సౌత్రాంతిక 4. వైభాషిక. ఇది వేద ప్రమాణములకు భిన్నము.

 

వేదాగమా విషయ విగ్రహ ! వేదవేద్యా ! వేదాంగ వేదమత వేద వివేకశీలా !

వేదాదివేదమయ ! వేదగ ! వేదజిహ్వా ! వేదాంత తత్త్వ సువేచన వేదితవ్యా !    

© 2018 tripurasramam

designed by tripurasramam media

Call us:

+91 9666153554

Find us: 

bhadrachalam, telangana, 507111

bottom of page